బాహుబలి చిత్రం తెలుగు ఇండస్ర్టీ గొప్పతనాన్ని అమాంతం పెంచేసిన హీరో ప్రభాస్. ఓ వైపున 'సాహో' సినిమా షూటింగులో పాల్గొంటూనే, మరో వైపున 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోని సినిమాను కూడా కానిచ్చేస్తున్నారు. 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. యూవీ క్రియేషన్స్ వారు .. గోపీకృష్ణ మూవీస్ వారు కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ను ఐరోపాలో కొంతవరకూ చిత్రీకరించారు. ఇకపై అక్కడ చేయవలసిన సన్నివేశాలను, కొన్ని కారణాల వలన హైదరాబాద్ లోనే చేయడానికి సిద్ధమయ్యారు. 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా ఒక భారీ సెట్ ను వేయిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగు ఇందులోనే జరుగుతుందని చెబుతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, 'సాహో' తరువాత ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్కు పండగే పండగ బాహుబలి చిత్రం కోసం చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఒక ఏడాదిలోనే రెండు చిత్రాలతో ప్రేక్షకులకు షాక్ ఇవ్వనున్నారంటే ఒకరకంగా ప్రభాస్ ఫ్యాన్స్కు పండగనే చెప్పాలి. కాకపోతే ఇంత భారీ బడ్జెట్తో కూడుకున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ ముందు ఏమాత్రం ఆడతాయో వేచి చూడాలి. అలాగే బాహుబలి లాంటి పెర్ఫార్మెన్స్ను ప్రభాస్లో చూశాక మరి తర్వాత ఆయన చిత్రాలపై ప్రేక్షకులకు కాస్త అంచనాలు పెద్దగానే ఉంటాయి అంటున్నారు సినీ పండితులు.