అక్కినేని అఖిల్ నటించిన మూడు సినిమాలు ఘోరమైన ప్లాప్ ను చవిచూశాయి. దీనితో ఇప్పుడు అఖిల్ కు హిట్అనేది అనివార్యం అయిపోయింది. ప్రస్తుతం అఖిల్.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సంతకం పెట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.
కానీ, కొద్దిరోజులుగా అఖిల్ సరసన నటింపజేసే హీరోయిన్ ఇంకా ఓకే కాలేదని, అందుకే ఈ సినిమా పట్టాలెక్కలేదని వార్తలు వస్తున్నాయి. ఇందులో అఖిల్ సరసన కియారా అద్వానీని తీసుకుంటున్నారని, కాదు కాదు.. రష్మిక మందన్నాను ఓకే చేశారని ప్రచారం జరిగింది. అయితే, ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడానికి హీరోయిన్ కారణం కాదని తెలిసింది. దీనికి కారణం కథ పూర్తి కాకపోవడమేనని సమాచారం.
ఈ సినిమాకు సంబంధించినంత వరకు అన్నీ సెట్ అయినప్పటికీ.. కథ విషయంలో క్లారిటీ రావడం లేదట. ఇంటర్వెల్ వరకు ఈ సినిమా కథ సూపర్గా ఉన్నా సెకండ్ హాఫ్ పూర్తి కాలేదని తెలిసింది. దీంతో ఇద్దరు ముగ్గురు రచయితలను సంప్రదించారట. అయినా ఏం లాభం లేదని సమాచారం. సినిమా మొదలుపెట్టేసి కథ తర్వాత రాసుకుందామని అనుకున్నప్పటికీ, అది వర్కౌట్ కాదేమోననే ఉద్దేశ్యంతోనే సినిమాను ప్రారంభించడం లేదని తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్కు గతంలో తగిలిన దెబ్బల వల్లే ఈ సినిమాను ఇంత జాగ్రత్తగా తీయాలని డిసైడ్ అయ్యాడట. ఆయన టాలీవుడ్లో బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త అనే సినిమాలను చేసిన విషయం తెలిసిందే. వీటిలో చివరి రెండు ఘోర పరాజయం పాలయ్యాయి.