మరో 40 గంటలలో ఎన్నికల ఫలితాలు రాబోతున్న నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు తెగ టెన్షన్ పడుతూ ఉంటే సామాన్య ప్రజలు ఎన్నికల క్లైమాక్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ టెన్షన్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
దీనికితోడు మొన్న ఆదివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఈ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడి ఎక్కిస్తున్నాయి. ఈసారి మెజారిటీ సర్వేలు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ సీఎమ్ అవుతాడని వస్తున్న సర్వేలను చూసి తెలుగుదేశం వర్గాలు తెగ మదన పడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటి ముందు జూనియర్ అభిమానులు సృష్టించిన సెన్సేషన్ కారణం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు మొన్న ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ బయటకు వచ్చిన తరువాత ఎన్టీఆర్ నివాసానికి కొందరు ‘జై ఎన్టీర్’ సీఎమ్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ తారక్ ఇంటి వద్దకు వెళ్లి హడావిడి చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానులు హంగామా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే జూనియర్ ఇంటి వద్ద ఈ హడావిడి ఎవరు ఎందుకు చేసారు అన్న క్లారిటీ లేకపోయినా ఎన్నికల ఫలితాలు రాబోతున్న ఈ సమయంలో ఈ హడావిడి జరగడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో జూనియర్ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించడంలేదని తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని తెలిపిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో ఈ నినాదాల హడావిడి వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు..