అక్కినేని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'సమంత' సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది . తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించడమే కాదు.. శతాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. భారతీయ అధికారిక భాషలన్నింటిలోనూ సినిమాలు నిర్మించిన ఒకే ఒక్క ప్రొడక్షన్ హౌస్ కూడా సురేష్ ప్రొడక్షన్స్. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నాటి అగ్ర కథానాయకుల నుంచి.. నేటి యంగ్ స్టార్స్ వరకు సినిమాలను నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఈ ఏడాదితో 55 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది.
ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్లో నిర్మిస్తున్న "ఓ బేబి" సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.
పెర్ఫామెన్స్ కు ఎంతో స్కోప్ ఉన్న పాత్రలకు తన నటనతో ప్రాణం పోస్తూ సినిమా స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న అగ్ర కథానాయిక.. సమంత అక్కినేని. 'ఓ బేబి' సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాలో సామ్ తో పాటు సీనియర్ నటి లక్ష్మి కూడా కీలక పాత్రలో నటించారు. బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన "ఓబేబి" ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి కీలక పాత్రల్లో నటించగా మిక్కి జె.మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్రోస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.