సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఎన్నికలకు ముందే తెలంగాణాలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు విమర్షకుల ప్రశంసలను అందుకుంది. అయితే ఇదే సినిమాని వర్మ ఏ.పి.లో విడుదల కానివ్వకుండా అక్కడి ప్రభుత్వం అడ్డుకుంది. ఎన్నికల రిజల్ట్ వచ్చేంతవరకు విడుదల చేయకూడదని షరతు విధించింది. అయితే ఈ నెల 23 న రిజల్ట్ వచ్చి కొత్త ప్రభుత్వం రాబోతోంది. వై.ఎస్.జగన్ ముఖ్య మంత్రిగా 30న ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వర్మ తన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు.
ఈ సందర్భంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో నిజం చెప్పేందుకు ప్రయత్నించామని, కానీ కొంతమందికి నచ్చక సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించారని సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఈ సమావేశంలో అన్నారు. దాంతో పాటు ఈ నెల 31న ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 75 ఏళ్లు రాజుగా బతికిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చివరి దశలో నరకయాతన పడి మరణించారని, ఆ నరకయాతనకు గల కారణాలు ఏంటని అందరికి తెలియజేయాలనిపించి ఈ సినిమా తీసినట్లు వర్మ తెలిపారు.
నేను సినిమా తీస్తే టి.డి.పి అధినేత చంద్రబాబు వివాదం చేశారన్నారు. తెలంగాణలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా విడుదలైందని, కానీ ఇక్కడ సైకిల్ జోరువల్ల విడుదల చేయలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ సైకిల్కు పంక్చర్ అవ్వడంతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నానన్నారు. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలు భయటపెట్టడం మినహా ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, నేను నా అన్ని సినిమాల్లాగానే ఈ సినిమాను తీశానని అన్నారు.