ఒక డైరెక్టర్ పాపులర్ అవ్వాలంటే ఒక్క హిట్టు పడి అది బ్లాక్ బస్టర్ మూవీగా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తే చాలు. ఇక ఆ డైరెక్టర్ గురించి అన్నీ చిత్ర పరిశ్రమలలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ అందరు అతని మీద కర్చీఫ్ వేసేస్తారు. ఇక స్టార్ హీరోలు కూడా ఆ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోతారు. ఇక ప్రస్తుతం కన్నడ దర్శకుడు 'ప్రశాంత్నీల్' పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈయనకు 'కేజీఎఫ్ చాప్టర్1' రెండో సినిమానే. మొదటి సినిమా 'ఉగ్రం'. ఇక రెండో సినిమా 'కేజీఎఫ్ చాప్టర్1'తో ప్రశాంత్నీల్ సత్తా దేశవ్యాప్తంగా తెలిసిందే. ముఖ్యంగా ఒక్క హిట్ వస్తే చాలు అతనిపై వాలిపోయే టాలీవుడ్ నిర్మాతలు పలువురు ప్రశాంత్ నీల్ కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు.
కానీ బడా బడా నిర్మాతలైన దిల్రాజు, అల్లుఅరవింద్, యువి క్రియేషన్స్ వంటి వారిని 'కేజీఎఫ్ చాప్టర్2' వరకు వెయిట్ చేద్దామని తప్పించుకున్నప్పటికి.. నీల్ మైత్రి మూవీ మేకర్స్ తో మాత్రం ఓకే అయిపోయాడు. గతంలో పలువురు పెద్ద పెద్ద తమిళ, కన్నడ దర్శకులే కాదు.. మహేష్భట్, రవిచంద్రన్, ప్రతాప్పోతన్, మణిరత్నం( గీతాంజలి) మినహా, కెమెరామెన్ శివ, విష్ణువర్ధన్ వంటి దర్శకులు కూడా తెలుగులో పెద్దగా రాణించలేకపోయారు. కనీసం ప్రశాంత్ నీల్ది రెండు సినిమాల ముచ్చటగా మిగలకూడదు అనుకుంటే యష్తో పాటు సంజయ్దత్, రవీనాటాండన్ వంటి వారు నటిస్తున్న 'కేజీఎఫ్ చాప్టర్2' వరకైనా ఎదురుచూడటం చాలా ముఖ్యమని ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది అభిప్రాయపడుతున్నారట.
దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఎన్నోసినిమాలతో ప్రూవ్ చేసుకుని మరి 'బాహుబలి'తో ప్రపంచ స్థాయిలో ఎదిగాడు. 'ఈగ' నుంచి 'బాహుబలి' వరకు ఆయన ఎక్కడా తొందరపడ్డ దాఖలాలు లేవు. మరి ప్రశాంత్నీల్ కి అంత స్టార్ డం రావాలంటే ఇంకా చాలా టైం పడుతుందా లేదా అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. ఇక ప్రశాంత్నీల్ మైత్రిమూవీమేకర్స్ సంస్థతో చేయబోయే చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో అని ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా ఎన్టీఆర్తో నీల్ చిత్రం ఉంటుందా? లేదా? అన్నది 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్ చాప్టర్2' తర్వాతనే తేలుతుంది.