మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. తమిళ నటుడు అథర్వ మురళి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు ఇది రీమేక్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో ‘వాల్మీకి’ పేరుతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ ఎల్ఎల్‌పి పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయానకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 
ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ‘వాల్మీకి’ విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర హీరో వరుణ్ తేజ్ సోమవారం ట్వీట్ చేశారు. 


ఇదిలా ఉంటే, చిత్ర ప్రీ-టీజర్‌ను త్వరలోనే విడుదలచేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తామని రంజాన్ రోజున దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతానికైతే విడుదల తేదీని ప్రకటించారు. మరి ప్రీ-టీజర్ ఎప్పుడు వదులుతారో చూడాలి. హరీష్ శంకర్ మాటలు, దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని జనవరిలో లాంఛనంగా ప్రారంభించారు. ఆ తరవాత ‘వాల్మీకి’ టైటిల్‌పై వివాదం చెలరేగింది. గ్యాంగ్‌స్టర్ మూవీకి వాల్మీకి పేరు ఎలా పెడతారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందే వార్తల్లోకి ఎక్కింది. ఆ తరవాత ఈ ఆందోళన సద్దుమణిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: