మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ‘విజేత’ విడుదలై ఏడాది గడిచిపోయినా ఇంకా తన రెండో సినిమాను కళ్యాణ్ ప్రకటించలేదు.


ప్రస్తుతానికి అయితే తన గారాలపట్టి నవిష్కతో ఆడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, కళ్యాణ్ దేవ్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంత మంది పనిగట్టుకుని ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. అసభ్యకర కామెంట్లు పెడుతున్నారు. ఈ కామెంట్లను భరించలేక ఆయన పోలీసులను ఆశ్రయించారు. 


ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పోస్ట్ చేసే ఫొటోల కింద ఓ 10 మంది వ్యక్తులు దారుణమైన కామెంట్లు చేస్తున్నారని.. తన కుటుంబసభ్యులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కళ్యాణ్ దేవ్ ఇటీవల ఫిర్యాదు చేశారు. 


ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ 10 మందిని గుర్తించారు. వారి వివరాలు, ఐపీ అడ్రస్‌లు కావాలని ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాశారు. ఈ వివరాలను తాజాగా సైబర్ క్రైం అడిషనల్ డీసీపీ రఘువీర్ వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి వివరాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: