రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో అక్కినేని నాగ చైతన్యతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా కమర్షియల్ సక్సస్ ను సాధించింది. అయితే ఇలా నాగ చైతన్యతో రొమాన్స్ చేసే వయసులో ఉండి కూడా నాగార్జునతో జంట కట్టిందంటే రకుల్ ప్రీత్ సింగ్ చాలా పెద్ద రిస్క్ చేసినట్టే. చేసిన పాత్ర కంటే కూడా ఎవరి పక్కన నటించిందన్న విషయమే ఎక్కువ పట్టించుకునే మన సినీ ఇండస్ట్రీలో నాగార్జునలాంటి అరవయ్యేళ్ల హీరోతో నటిస్తే ఇక ముప్పయ్లలో వున్న హీరోలు ఎలా ఛాన్స్ ఇస్తారు. ఇదంతా తెలిసినా కానీ రాహుల్ రవీంద్రన్ చెప్పిన కథ నచ్చడంతో 'మన్మథుడు 2'కి ఓకే చెప్పేసింది రకుల్.
ఇక ఈ సినిమాకి రకుల్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అని తెలిసినా కానీ టీజర్లో తనకి చోటు ఇవ్వలేదు. కనీసం రకుల్ నీడ కూడా చూపించకుండా టీజర్ కట్ చేయడం రకుల్ ఫాన్స్కి అస్సలు నచ్చలేదు. అయితే రకుల్ని టీజర్లో కొన్ని క్షణాలు చూపిస్తే ఆమెకి జస్టిఫికేషన్ జరగదని, అందుకే ఆమె కోసం ప్రత్యేకంగా ఒక టీజర్ కట్ చేస్తున్నామని రాహుల్ సర్ధి చెప్పాడు.
ఇంతకముందు రంగస్థలం సినిమాకి కూడా ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్లో సమంతని చూపించలేదు. వెంకటలక్ష్మిని పరిచయం చేయడానికి ప్రత్యేకించి టీజర్ రిలీజ్ చేసారు. అలాగే మన్మథుడి 'అవంతిక'కి కూడా స్పెషల్ టీజర్తోనే ఇంట్రడక్షన్ జరుగుతుందట. కాకపోతే దీనికోసం అభిమానులు మరో మూడువారాలు వేయిట్ చేయక తప్పదని చిత్ర బృందం చెప్తున్నారు.