టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటకీ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. తండ్రి బెల్లంకొండ సురేష్ అగ్ర నిర్మాతగా ఉండడంతో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు, టాప్ డైరెక్టర్ల, టాప్ హీరోయిన్లతో నటించినా బెల్లంకొండకు కమర్షియల్ బ్రేక్ రాలేదు. ఇటీవల తేజ దర్శకత్వంలో రాముడు మంచి బాలుడు క్యారెక్టర్లో శ్రీను నటించిన సీత సినిమా కూడా మనోడికి సక్సెస్ ఇవ్వలేదు.
గతేడాది చివర్లో వచ్చిన కవచం సినిమా.. తాజాగా సీత రెండు కూడా అట్టర్ప్లాప్ అయ్యాయి. ఒకే ఒక్క కమర్షియల్ హిట్ కోసం బెల్లంకొండ బాబు మొహం వాచిపోయి ఉన్నాడు. ప్రస్తుం బెల్లంకొండ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ రాక్షసన్ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రాక్షసుడు పేరుతో వస్తోన్న ఈ సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రైం థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అదిరిపోయే బిజినెస్ డీల్స్ వస్తున్నాయట. శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.
ఇటీవల బెల్లంకొండ సినిమాలకు హిందీ డబ్బింగ్ చేసి యూట్యూబ్లో పెడితే టాప్ వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాక్షసుడు హిందీ డబ్బింగ్ హక్కులను, తెలుగు శాటిలైట్ రైట్స్ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు 18.5 కోట్ల భారీ మొత్తానికి అమ్మారని సమాచారం. కేవలం తెలుగు శాటిలైట్ రైట్స్ కొరకు 6 కోట్లు, హిందీ డబ్బింగ్ హక్కుల కొరకు 12.5 కోట్లు చెల్లించేలా డీల్ ఓకే అయ్యిందట. వరుస ప్లాపులతో ఉన్న బెల్లంకొండకు ఇది భారీ రేటే అని చెప్పాలి.