రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఇందులో హీరోయిన్. భారీ బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తెలుగు‌తో పాటు హిందీ, తమిళం, మలయాళంలో విడుదలవుతోన్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. ముఖ్యంగా బాలీవుడ్‌కు చెందిన జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేశ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, టిన్ను ఆనంద్, చంకీ పాండేతో పాటు తమిళ నటుడు అరున్ విజయ్, మలయాళ నటుడు లాల్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సుప్రీత్ ప్రధాన తారాగణంగా ఉన్నారు.

 

బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రకటించిన ‘సాహో’ రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాలో తన షూటింగ్ భాగాన్ని పూర్తిచేసుకున్నట్టు కీలక పాత్ర పోషిస్తోన్న నీల్ నితిన్ ముకేశ్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. ప్రభాస్, శ్రద్ధకపూర్, దర్శకుడు సుజీత్, మురళీశర్మలతో తీసుకున్న ఫొటోలను ట్వీట్‌లో పొందుపరిచారు.

 

‘ఈ బ్యూటిఫుల్ జర్నీ ప్రారంభమై రెండేళ్లు గడిచింది. ‘సాహో’ సెట్స్ నుంచి నేను సెలవు తీసుకునే సమయం వచ్చింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్, నా సోదరుడు సుజీత్, చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు’ అని నీల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. హిందీలో టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ‘సాహో’ను విడుదల చేస్తున్నారు.

 

రన్ రాజా రన్ తో గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ రచన, దర్శకత్వం అందిస్తున్నారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. ఇంకా పాటల రికార్డింగ్ పూర్తికాలేదు. శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకోవడంతో మరో సంగీత దర్శకుడి కోసం దర్శక నిర్మాతలు వేట మొదలుపెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 15కి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక స్వాతంత్య్రం రోజు డార్లింగ్ అభిమానులకి పండగే పండగ.


మరింత సమాచారం తెలుసుకోండి: