కలెక్షన్ కింగ్, దిగ్గజ నటుడు మంచు మోహన్‌బాబుపై తమిళ స్టార్ హీరో సూర్య ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి దిగ్గజంతో పనిచేయడం తన అదృష్టమని అన్నారు. సూర్య హీరోగా ‘సూరరాయి పోట్రు’ అనే సినిమా తెరకెక్కుతోంది. ‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఛండీగఢ్‌లో తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో మోహన్‌‌బాబు పాల్గొన్నారు. శుక్రవారం ఆయన చిత్ర యూనిట్‌తో కలిశారు.

 

షూట్లో మోహన్‌బాబుతో కలిసి పనిచేయడం పట్ల సూర్య ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘గొప్ప క్రమశిక్షణ కలిగిన దిగ్గజం మోహన్‌బాబు గారితో సెట్స్‌లో గడపడం ఎంతో అదృష్టం. ఒక గ్యారేజ్‌లో మొదలై 500 పైగా సినిమాల వరకు వెళ్లిన ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఇదో అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ‘సూరరాయి పోట్రు’లో భాగమైనందుకు మీకు కృతజ్ఞతలు సార్’ అని సూర్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

బదులుగా బాబు ట్విట్టర్ ద్వారా సూర్యకు మోహన్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇంత గొప్పగా చెప్పినందుకు థ్యాంక్యూ సూర్య. ఈ తరం టాప్ స్టార్లలో మీరు ఒకరైనప్పటికీ సెట్స్‌లో మీ క్రమశిక్షణ, విధేయత మీ గొప్ప క్యారెక్టర్‌ గురించి చెబుతాయి. తరవాత షెడ్యూల్ గురించి వేచి చూస్తున్నాను, మై యంగ్ ఫ్రెండ్’ అని మోహన్‌బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

అయితే మోహన్‌బాబు ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు.  ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్మెంట్, సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై సూర్య, గునీత్ మోంగా నిర్మిస్తున్నారు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఛండీగఢ్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: