ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ‘RRR’ ప్రస్తుతం హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఎన్టీఆర్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. గాయం కారణంగా విశ్రాంతిలో ఉన్న రామ్ చరణ్ షూటింగ్‌లో జాయిన్ కావాల్సి ఉంది. 1920 కాలానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఫిక్షనల్ డ్రామాలో సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.

 

ఇంకా సినిమా సెట్స్‌పై ఉండగానే రికార్డు ధరకు ‘RRR’ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.70 కోట్ల భారీ ధరకు ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను విక్రయించారని అంటున్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఓవర్సీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘ఫార్స్ ఫిల్మ్స్’ రూ.70 కోట్లు వెచ్చించి ‘RRR’ రైట్స్‌ను కైవసం చేసుకుంది. ఈ సినిమాను భారీ ఎత్తున ఓవర్సీస్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘RRR’. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి ఉంది. అలానే, ఓవర్సీస్‌లో ఉన్న భారతీయులు సైతం ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ, మలయాళంలోకి అనువాదం అవుతుంది. వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

బాహుబలి లాంటి వరల్డ్ క్లాస్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ‘RRR’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బిజినెస్ కూడా జరుగుతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఏదేమైనా మన తెలుగు సినిమా ఖ్యాతిని యావత్ ప్రపంచం నలుమూలలకు తెలియజేసిన జక్కన్నను మనం పొగడాల్సిందే!


మరింత సమాచారం తెలుసుకోండి: