ఇటీవలి కాలంలో తెలుగు సినిమా హీరోలకు జరుగుతున్న వరుస ప్రమాదాలు ఇండస్ట్రీని కలవర పెడుతున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య షూటింగ్‌లో భాగంగా గత వారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన ఆయన ప్రస్తుతం తన ఇంట్లోనే చికిత్స పొందుతూ రెస్ట్ తీసుకుంటున్నాడు. 


అయితే ఈ రోజు (బుధవారం) నాగశౌర్యను పరామర్శించేందుకు గాను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, డైరెక్టర్ కమ్ రైటర్ బీవీఎస్ రవి వచ్చారు. ఆయన కాలికి తగిలిన గాయాన్ని చూసి త్వరలోనే కోలుకొని తిరిగి యదా స్థితికి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా అక్కడ తీసిన కొన్ని ఫోటోలను నిర్మాత, పీఆర్ఓ సురేష్ కొండేటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన సొంత బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న సినిమా షూట్‌లో భాగంగా నాగ శౌర్య గాయపడ్డారు.


ఐరా క్రియేషన్స్ పేరుతో ఓ సొంత బ్యానర్ ప్రారంభించిన నాగ శౌర్య ఈ బ్యానర్‌పై స్వయంగా తానే హీరోగా నటిస్తూ కొత్త సినిమా మొదలు పెట్టేశాడు. రమణ తేజ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రంలో నాగ శౌర్య సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 14 వ తేదీన వైజాగ్‌లో షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరగడంతో నాగ శౌర్య కాలు ఫ్యాక్చర్ అయింది. 


ఆయనను పరిశీలించిన వైద్యులు నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు తన సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చాడు నాగ శౌర్య. పూర్తిగా కోలుకున్నాకే ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు. సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఓ బేబీ చిత్రంలో కూడా నాగ శౌర్య నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికావడంతో ఎలాంటి సమస్య తలెత్తలేదు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: