సమంత ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలు, కమర్షియల్ సినిమాలు చేసిన సమంత ప్రస్తుతం కథలకు, పాత్రలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. అక్కినేని నాగచైతన్యను పెళ్లిచేసుకున్న తరవాత సమంత పూర్తిగా స్టైల్ మార్చేశారు. ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యూటర్న్’, ‘మజిలీ’ వంటి మంచి చిత్రాల్లో నటించారు.  ఇప్పుడు మరో వైవిధ్యమైన చిత్రం ‘ఓ బేబీ’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దక్షిణ కొరియా బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ అయిన ఈ సినిమాకు బీవీ నందిని రెడ్డి  డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. డి.సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మాతలు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.  లక్ష్మీ భూపాల్ మాటలు రాశారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.

 

70 ఏళ్ల పెద్దావిడ జీవితంలో జరిగిన మ్యాజిక్కే ఈ ‘ఓ బేబీ’ సినిమా కథ. ఓ ఫొటో స్టూడియోలో 70 ఏళ్ల పెద్దావిడ ఫొటో దిగుతుంది. ఆ తరవాత ఆమె 23 ఏళ్ల పడుచు పిల్లలా మారిపోతుంది. ఆ తరవాత ఆమెకు ఎదురైన అంశాలు, జీవితంలో చోటుచేసుకున్న మార్పులతో కూడిన ఎమోషనల్ కామెడీ జర్నీ ‘ఓ బేబీ’. ఇదే విషయం తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. రాజేంద్ర ప్రసాద్ పాత్ర థియేటర్‌లో నవ్వులు పువ్వులు పూయించేలా ఉంది. సమంత సొంతంగా చెప్పుకున్న డబ్బింగ్ సినిమాకు మరో హైలైట్. సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, నాగశౌర్య, తేజ, ఊర్వశి, ప్రగతి తదితరులు సినిమాలో నటిస్తున్నారు.

 

ఒకప్పటి బాల నటుడు తేజ ఈ సినిమాలో టీనేజర్‌ పాత్రలో అధ్బుతంగా నటించాడు. బహుశా 70 ఏళ్ల పెద్దావిడకు అతను మనవడు అనుకుంటారు.  కానీ, ఆమె 23 ఏళ్ల పడుచు పిల్లలా మారిపోయినప్పుడు ఎవరో తెలియక ఇష్టపడతాడు. ఇదే విషయం ఆమెతో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. ‘నానమ్మనురా నీకు. చెప్తే చంపేస్తాను సచ్చినోడా’ అంటూ సమంత ఇచ్చే హావభావాలు ఆకట్టుకుంటాయి.  ఓవరాల్ గా  సమంత మరోసారి తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడం ఖాయమని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: