30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్తో పృద్వి టాలీవుడ్ సినిమాల్లో టాప్ కమెడియన్గా దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. గడిచిన ఎన్నికల్లో కమెడియన్ పృద్వి వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తూ జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని కొందరు పృద్విని మెగా హీరోలు తమ సినిమాల నుండి పూర్తిగా బహిష్కరించారని, ఫలితంగా బన్నీ కొత్త సినిమా నుండి కూడా పృద్విని తొలగించారని వార్తలు పుట్టించారు. గత మూడు నాలుగు రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నాయి. వీటిపై స్పందించిన పృద్వి ఓ రేంజ్లో క్లారిటీ ఇచ్చారు.
` బన్నీ.. త్రివిక్రమ్ సినిమాలో పృద్విని ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో పృద్వి వైకాపాకు ప్రచారం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ ను చిరంజీవిని విమర్శించడంతో.. దాని ప్రభావం సినిమాపై పడింది. త్రివిక్రమ్.. బన్నీ సినిమా నుంచి పృద్విని పక్కన పెట్టారు. పృద్వి పాత్రను మరొకరికి ఆఫర్ చేసినట్టుగా సమాచారం.` అంటూ ఓ రేంజ్లో వైరల్ అయింది. దీనిపై పృద్వి స్పందించారు. అవన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చేశారు. తనను ఎవరూ బ్యాన్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అసలు తనకు త్రివిక్రమ్, బన్నీ సినిమాలో ఆఫర్ రానేలేదని అన్నారు.
కాగా, జగన్ విజయం అనంతరం 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి హైదరాబాద్ లోని బహీర్ బాగ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ``జగన్ ముఖ్యమంత్రిగా గెలవడం రాష్ట్ర ప్రజలందరికి శుభదినం. 3600 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాసమస్యలను విన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది భారీ విజయం. వైకాపా ఈ స్థాయిలో విజయం సాధించడం సంతోషంగా ఉంది. ఆరు నెలలో జగన్ ఎలాంటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలే చూస్తారు. కెఏ పాల్ జగన్ ను ఎగతాళి చేశారు. 100 స్థానాలు గెలుస్తారని అంటూ హేళనగా మాట్లాడారు. 100 కాదు ఇప్పుడు ఏకంగా వైకాపా 151 స్థానాలు గెలుచుకుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో టిడిపి గెలవలేదు. కాంగ్రెస్కు పట్టిన గతే టీడీపీకి పడుతుంది` అని అన్నారు.