టీవీ షోలో యాంకరింగ్‌తో పేరు సంపాదించి, సినిమాల్లో మంచి మంచి అవకాశాలు అందుకుంది అనసూయ. ముందు ఆమెను చాలామంది సీరియస్ గా తీసుకోలేదు, కానీ, తన గ్లామర్, యాక్టింగ్‌తో మెప్పించి పెద్ద స్థాయిలోనే ఛాన్సులు పట్టేసిందామె. ముఖ్యంగా ‘క్షణం’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలు అనసూయ ఏంటో అందరికీ తెలిసేలా చేశాయి.

 

ఈ రెండు చిత్రాల్లో అనసూయ నటన ప్రశంసనీయం. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రతో ఒకేసారి చాలా మెట్లు ఎక్కేసింది అనసూయ. ప్రేక్షకులు ఈ సినిమా తర్వాతే అనసూయను సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. ‘రంగస్థలం’ తర్వాత అనసూయ ఇంకా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవట్లేదు. పెద్ద స్థాయి చిత్రాలే ఓకే చేస్తోంది.

 

తాజాగా ఆమె తన కెరీర్లోనే అతి పెద్ద అవకాశాన్ని అందుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో అనసూయ ఓ కీలక పాత్ర చేస్తోందట. కొరటాల సినిమాలో ఏ పాత్రా డమ్మీగా ఉండదు. ప్రతి క్యారెక్టర్లోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అనసూయను ఏరికోరి ఎంచుకున్నారంటే ఆమె పాత్రలో ఏదో ఒక విశేషం ఉండకుండా పోదు. చిరు-కొరటాల సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా అనసూయ ఈ పాత్ర ఒప్పేసుకుందట.

 

మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుందట. రీఎంట్రీలో వరుసగా మూడో సినిమాను సొంత సంస్థ ‘కొణిదెల ప్రొడక్షన్స్’లోనే చేయబోతున్నాడు చిరు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన శ్రుతి హాసన్ నటించబోతోందని సమాచారం. ఇందులో చిరు ఎన్నారైగా, రైతుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: