కొన్ని రోజులుగా రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న బాల‌య్య మ‌ళ్లీ సినిమాల వైపు వ‌చ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు విడుద‌ల త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కు దూరమైపోయాడు బాల‌య్య‌. అప్ప‌ట్నుంచి రాజ‌కీయాల్లోనే కాలం గ‌డిపేస్తున్నాడు.

 

ఇక ఇన్ని రోజులకు మ‌ళ్లీ మేక‌ప్ వేసుకుంటున్నాడు ఈయ‌న‌. జై సింహా త‌ర్వాత మ‌ళ్లీ అదే కాంబినేష‌న్లో మ‌రో సినిమా రాబోతుంది. ఈ సినిమా క‌థ మారిపోయింది.. దాంతో సినిమా ఆగిపోయింద‌నే వార్త‌లు వినిపించినా కూడా ఇప్పుడు మ‌రో క‌థ‌తో బాల‌య్య‌ను మెప్పించాడు కేయ‌స్ ర‌వికుమార్.

 

ఈ మ‌ధ్యే ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా మొద‌లు పెట్టారు. సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లో సి.క‌ల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ ఓపెనింగ్ షాట్‌కు మాస్ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా.. బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కోదండరామిరెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 

బాల‌య్య పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌తో పాటు గ్యాంగ్ స్ట‌ర్‌గా కూడా న‌టించ‌బోతున్నాడు. పోలీస్ ఆఫీస‌ర్‌గా ఉన్న ఈయ‌న గ్యాంగ్ స్ట‌ర్ ఎందుకయ్యాడు అనేది ఈ చిత్రంలో ఆస‌క్తిక‌రంగా ఉండే అంశం. పైగా పొలిటిక‌ల్ ఇష్యూస్ కూడా ఈ చిత్రంలో చ‌ర్చించ‌బోతున్నాడు బాల‌కృష్ణ‌. ప‌రుచూరి ముర‌ళి గ‌తంలో బాల‌య్య న‌టించిన అధినాయ‌కుడు సినిమాను తెర‌కెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమాకు క‌థ అందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: