కొత్తవాళ్లతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. కేవలం తేజ్, శేఖర్ కమ్ముల లాంటి ఇద్దరు ముగ్గురు మాత్రమే కొత్త వాళ్ళతో సినిమాలు తీసి చాలా కాన్ఫిడెన్స్‌‌గా సినిమాలు తీసి సక్సస్ అయ్యారు. అంతేకాదు ఎంతో మంది కొత్త హీరో హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక మరీ ముఖ్యంగా కొత్త వాళ్ళని పెట్టి సినిమాలు తీసి భారీ విజయాలు సాధించడం శేఖర్‌ కమ్ముల స్టయిల్‌. శేఖర్తో పని చేయాలని మహేష్‌ బాబు లాంటి హీరోలు ఆసక్తి చూపించినా కానీ తను మాత్రం కొత్తవాళ్ల సినిమాలకే కట్టుబడ్డాడు. 'ఫిదా' సినిమాకి కూడా సాయిపల్లవి తెలుగు ఇండస్ట్రీకి కొత్తే. వరుణ్‌ తేజ్‌కి కూడా అప్పటికి అంత క్రేజ్ కూడా రాలేదు. అందుకే కొత్త వాళ్లతో సినిమా చేయడం కంఫర్టబుల్‌గా ఫీలయ్యే శేఖర్‌ కమ్ముల 'ఫిదా' తర్వాత కూడా కొత్తవాళ్లతోనే సినిమా మొదలు పెట్టాడు.


యాభై శాతానికి పైగా షూటింగ్‌ అయిపోయిన తర్వాత సినిమా చూసుకున్న శేఖర్‌ కమ్ములకి అది అనుకున్నట్టుగా రావడం లేదనిపించి మొత్తంగా ఆ సినిమాని పక్కన పడేశాడని లేటెస్ట్ న్యూస్. దానికి బదులుగా నాగచైతన్యతో మరో సినిమాకి శ్రీకారం చుట్టాడు. అయితే శేఖర్‌ కమ్ములకి దీని వల్ల వచ్చిన నష్టమేమీ వుండదట. అలాగే నిర్మాతకి వచ్చిన నష్టం కూడా మరో సినిమాలో కవర్‌ చేసుకోవచ్చట.


కానీ ఈ సినిమాతో అవకాశం దక్కించుకుని, భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న ఆ నటీనటుల మాటేమిటి? మళ్లీ వాళ్లకి ఇలాంటి అవకాశం వచ్చేదెప్పటికి? ఆ అవకాశం ఇచ్చేవాళ్ళెవరు. కొత్త వాళ్లతో సినిమాలు తీసే కాన్ఫిడెన్స్‌, కరేజ్‌ వున్న దర్శకులే తక్కువ. అలాంటిది శేఖర్‌ కమ్ముల లాంటి దర్శకులు కూడా కొత్తవారితో సినిమా తీయలేమని చేతులెత్తేస్తే వాళ్లతో చేసేదెవరు? మళ్లీ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ని తీసుకొచ్చేదెవరు? ఇప్పుడు ఈ విషయం గురించి ఫిల్మ్ నగర్‌లో ఓ చర్చ జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: