అవకాశం కోసం వెతికే దర్శకుడెవరైనా నిర్మాతను దక్కించుకోవడం కన్నా.. అతన్ని కాపాడుకోవడమే చాలా ముఖ్యమని సీనియర్‌ నటుడు అరుణ్‌ పాండియన్‌ పేర్కొన్నారు. ఎంబీ మహ్మద్‌ అలీ నిర్మాణంలో శక్తిశివన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దౌలత్‌’. శక్తిశివన్‌ హీరోగా నటిస్తున్నారు.

 

ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిర్మాత, నటుడు అరుణ్‌ పాండియన్‌ మాట్లాడుతూ.. ‘‘పెద్ద హీరోలు నటించిన చిత్రాలపై మాత్రమే ప్రేక్షకుల దృష్టి పడే పరిస్థితి ఏర్పడుతోంది.

 

చాలా సినిమాలు ఇంకా విడుదలకు నోచుకోలేని స్థితిలో ఉన్నాయి. అవన్నీ తెరపైకి రావాలి. ‘దౌలత్‌’ అంటే సిరిసంపద అని అర్థం. తప్పకుండా ఈ సినిమా నిర్మాతకు సిరిసంపదలను తెచ్చిపెట్టాలి. నటుడు జీవా నడిగర్‌ సంఘం గురించి పరోక్షంగా మాట్లాడారు. కానీ నేను నేరుగానే మాట్లాడుతున్నా. విశాల్‌ నిజస్వరూపం ఇప్పుడే అర్థమైంది.

 

ఎందుకంటే ఆయన నటించిన ‘అయోగ్య’ సినిమా నిర్మాత నా మిత్రుడు. అతనికి ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో నాకు తెలుసు. ముందు మనం నిజాయతీగా ఉండాలి. ఆ తర్వాతే పదవులలోకి రావాలి. నిర్మాతను దక్కించుకోవడం ముఖ్యం కాదు... నిర్మాతను కాపాడుకోవడమే ముఖ్యం అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: