జులై 14 వ తేదీన వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతున్నది. ఈ ఫైనల్ మ్యాచ్ కు ఎలాగైనా చేరుకోవాలని ఇండియా ప్రయత్నిస్తోంది. ఈసారి ఇండియాతో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ఫైనల్ కు వెళ్లే రేసులో ఉన్నాయి. ఈ నాలుగు జట్లు వరల్డ్ కప్ బలమైన జట్లుగా మారిన సంగతి తెలిసిందే.
ఇండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. అది తప్పించి ఆడిన నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ లపై ఇండియా విజయం సాధించి టాప్ ప్లేస్ లో ఉన్నది.
ఇండియా ఫైనల్స్ రేస్ లో ఉండటంతో.. జులై 12 వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాలు ఒకటికి రెండుసార్లు ఆలోచనలో పడ్డాయి. ఒకవేళ ఇండియా ఫైనల్స్ కు చేరుకుంటే.. ఆరోజు థియేటర్స్ అన్ని ఖాళీగా మారిపోవడం ఖాయం. క్రికెట్ మానియా అలాంటిది.
జులై 12 వ తేదీన రిలీజ్ కావాల్సిన రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాను వాయిదా వేసుకుంది. అసలే హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న రామ్..సినిమాను జులై 12 నుంచి జులై 18 కి వాయిదా వేసుకున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం.