తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘ప్రస్థానం’ ఒకటి. కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ సాధించకపోయినా.. దాని స్థాయిని తక్కువ చేయలేం. ఇప్పటికీ ఆ సినిమా గొప్పదనం గురించి సామాజిక మాధ్యమాల్లో చెప్పుకుంటూ ఉంటారు. ఐతే అంత గొప్ప సినిమా అందించిన దేవా కట్టా.. ఆ తర్వాత తన స్థాయి తగ్గ సినిమా తీయలేదు.

 

అక్కినేని నాగచైతన్యతో అతను రూపొందించిన ‘ఆటోనగర్ సూర్య’ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. కొన్నేళ్ల విరామం తర్వాత మంచు విష్ణు హీరోగా ‘డైనమైట్’ అనే రీమేక్ మూవీ చేస్తే అది ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది.ఈ సినిమా దెబ్బకు దేవా కెరీరే ప్రమాదంలో పడింది.

 

హిందీలో మాత్రం ఈ మధ్యే ‘ప్రస్థానం’ రీమేక్ పట్టాలెక్కించాడు. వెబ్ సిరీస్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఐతే ఎట్టకేలకు తెలుగులో దేవా తర్వాతి సినిమా ఖరారైనట్లు సమాచారం. మెగా హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా దేవా సినిమా మొదలు పెట్టనున్నాడట. అతడి కోసం ఒక వైవిధ్యమైన కథను దేవా రెడీ చేశాడట.

 

నిర్మాత ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదు. మెగా ఫ్యామిలీతో చాలా సంస్థలకు అసోసియేషన్ ఉంది కాబట్టి స్క్రిప్టు ఖరారైతే ఎవరో ఒకరు ముందుకు రావచ్చు. మరి ఈ సినిమాతో అయినా దేవా తన మునుపటి స్థాయిని అందుకుంటాడేమో చూద్దాం. తేజు త్వరలోనే మారుతి సినిమాను మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: