సూపర్స్టార్ మహేశ్బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు ప్రముఖ నటి విజయశాంతి. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ఇది. దాంతో ఆమె పాత్రపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.
అయితే సినిమాలో విజయశాంతి నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారని పలు మీడియా వర్గాలు అంటున్నాయి. అందులో నిజం లేదని తాజాగా విజయశాంతి ఓ ఆంగ్ల మీడియా ద్వారా వెల్లడించారు.
‘ఇందులో నాది నెగిటివ్ పాత్ర కాదు. కీలకమైన పాజిటివ్ పాత్ర. నా పాత్రకు మహేశ్ పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాగని నా పాత్ర ఆయనకు ఏమాత్రం తీసిపోదు. దర్శకుడు అనిల్ రావిపూడి కథ వినమని వేడుకున్నారు. వినగానే నాకు నచ్చింది. అందుకే క్షణం కూడా ఆలోచించకుండా సినిమాకు సంతకం చేశాను’ అని వెల్లడించారు విజయశాంతి.
ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్టు.. ఈరోజు విజయశాంతి తన 53వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు.