కథానాయిక కృతిసనన్ తన తాజా చిత్రం 'అర్జున్ పటియాలా' విడుదల కోసం నిరీక్షిస్తుంది. అయితే నటన అనే వృత్తి మాత్రం చాలా కష్టతరమైందని, నటీనటులు తమ జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారని అయినా తమ వాస్తవ జీవితంలో ఉండే భావోద్వేగాలు ఒక సారి కెమెరా ముందుకెళితే అవి వ్యక్తం కానివ్వరని చెప్పింది కృతి.
''నటులుగా మా జీవితాల్లోనూ ఆందోళనలు, ఒత్తిళ్లు ఉంటాయి. ఎప్పుడైతే సినిమా కోసం పని చేయడానికి కెమెరాముందుకు వెళ్లిన వెంటనే ఓ వ్యక్తిగా మరిచిపోయి ఆ పాత్రలోకి వెళ్లిపోతాం. 'లుకీ చుప్పీ' సినిమా నా వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడే కొంత సందేశాన్నిచ్చింది కానీ టైమింగ్ ప్రకారమే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చేశాను.
నటిగా స్విచ్చాఫ్, స్విచ్చాన్లు నిత్యం ఉంటాయి. నీకు నువ్వే ఉంటే వాస్తవమైన భావోద్వేగాలను అక్కడ వ్యక్తం చేయడం కష్టం. నటిగా ఇది వృత్తిధర్మ అనుకుంటేనే చేయగలం' అని చెప్పింది కృతి. తన ప్రాజెక్టుల ఎంపిక గురించి మాట్లాడుతూ 'సినిమా సినిమాకు ఇంత విరామం రావడం నాకు చాలా ఇష్టం. దానికీ ఓ కారణం ఉంది.
ఈ తరహా చిత్రాలు నన్ను ఆకర్షించడం వల్లే ఇంత గ్యాప్ వస్తుంది. ఇటువంటి సినిమాలనే నేనూ చూస్తా' అని తెలిపింది కృతి. గతంలో ఈమె మన సూపర్ స్టార్ మహేష్ బాబు తో 1 'నేనొక్కడినే' లో నటించి, విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి మనకి తెలిసిందే!