స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’. ఈ చిత్రం గత ఏడాది ప్రారంభమైన షూటింగ్ జూన్ 24 సాయంత్రంతో పూర్తయ్యింది. ఉన్న ఫలంగా సెట్స్ ఖాళీ చేయించడం.. అగ్ని ప్రమాదం జరగడం లాంటి కారణాలతో ఒకింత షూటింగ్ ఆలస్యమైన విషయం విదితమే. అయితే ఎట్టకేలకు నేటితో విజయవంతంగా ‘సైరా’ చిత్రబృందం షూటింగ్ పూర్తి చేసింది.


షూటింగ్ పూర్తయిన విష‌యాన్ని సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్నవేలు తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘సైరా షూటింగ్ పూర్తి అయ్యింది. సైరా టీమ్‌తో మ‌ర‌చిపోలేని ప్రయాణం జరిగింది. టీమ్‌లోని ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. నాకు స‌హ‌కరించిన అందరికీ థ్యాంక్స్. ఇప్పుడే డిఐ వ‌ర్క్ కూడా ప్రారంభమైంది’’ అంటూ ర‌త్నవేలు తెలిపారు.


ఇదిలా ఉంటే.. చిరు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌ అమితాబ్‌ బచ్చన్, విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, కిచ్చాసుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, అనుష్క, త‌మ‌న్నాతో పాటు పలువురు ప్రముఖులు నటించారు. అక్టోబ‌ర్ 2న సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: