తెలుగు తెరపైకి అడుగుపెట్టిన వారిలో మిల్కిబ్యూటీ తమన్నా ఒకరు. తమన్న దశాబ్దకాలంగా జోరుగా సినిమాలు చూస్తూ వస్తోంది. దాదాపు రెండు తరాల అగ్ర హీరోలందరితో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ బాహుబలి సినిమాలో డిఫెరెంట్ రోల్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం అలాంటి ఛాయలే ఉన్న మరో పాత్రను 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో తమన్నా చేస్తోందని తెలిసింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో తమన్నా చేసేది నెగెటివ్ రోల్ అని, సైరాలో ప్రతినాయికగా తమన్నా కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.

రోజురోజుకూ ఈ రకమైన వార్తలు జోరందుకోవడంతో బెంబేలెత్తిపోయిన తమన్నా.. సదరు వార్తలపై సీరియస్ అయింది. సైరా నరసింహా రెడ్డి సినిమాలో తనది ప్రతినాయిక క్యారక్టర్ కాదని, చాలా ప్రాముఖ్యత కల్గిన పాత్రలో నటిస్తున్నానని తమన్నా అంటోంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని, తన పాత్రపై మీడియా కావాలనే నెగటివ్ ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది తమన్నా. అసలు నిజానిజాలేంటో ఏ కొద్దిమాత్రం కూడా ఆలోచించకుండా ఇలా వార్తలు పుట్టించడం మంచి పద్ధతి కాదని ఆమె అంటోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. చిత్రంలో నయనతార, తమన్నా, అనుష్క చిరు సరసన నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, విజయ్ సేతుపతి లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంటోంది. అక్టోబర్ 2 వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: