ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా తాప్సి, కెరీర్ తొలినాళ్లలో సినిమా అంటే ఏమిటో, ఎలా నటించాలో అర్థమయ్యేది కాదు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా చెప్పేవారు ఎవరూ లేరు. ఈ క్రమంలో అనేక తప్పులు చేశాను. అవి నాకు ఎన్నో పాఠాలు నేర్పించాయి. ప్రస్తుతం ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతున్నాను. నా సినిమాలు చూడటానికి ప్రేక్షకులు వెచ్చిస్తున్న విలువైన డబ్బు, కాలానికి న్యాయం చేసే కథల్ని ఎంచుకుంటున్నాను.
బద్లా’ నటిగా నా బాధ్యతను మరింత పెంచింది. నా నుంచి ప్రేక్షకులు మరిన్ని మంచి సినిమాలు ఆశిస్తున్నారు. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అంచనాలు లేకపోతే కెరీర్లో కిక్ ఉండదు. నవ్వుకోవడానికి, డ్యాన్సులను చూసి సంతోషపడటానికే కాకుండా కథలోని థ్రిల్ను అనుభవించడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని ఈ సినిమా పెంచింది.
తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే మంచి కథాంశాల్లో భాగమవ్వాలని నిర్ణయించుకున్నాను. అలాంటి కథల కోసం ఎదురుచూస్తున్నాను. కథలో భాగం అయితే తప్పకుండా గ్లామరస్ పాత్రలు, ప్రత్యేక గీతాల్లో కనిపిస్తాను.
బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మంగల్'లో శాస్త్రవేత్తగా నటిస్తున్నాను. యథార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలకానుంది. ‘సాండ్ కి ఆంఖ్' సినిమా చిత్రీకరణ పూర్తయింది. దీపావళికి విడుదలకానుంది.ఇందులో అరవై ఐదేళ్ల వృద్ధురాలిగా కనిపిస్తున్నాను. తమిళంలోనూ ఓ సినిమా చేయబోతున్నాను. అని వివరించింది.