టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామానాయుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన రామానాయుడు భారతదేశంలోని అన్ని భాషల్లోనూ సినిమాలు తీసిన ఏకైక నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా చరిత్రలో సురేష్ ప్రొడక్షన్స్ది ప్రత్యేక అధ్యాయం. తాజాగా ఆ బ్యానర్ 55 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఇంత సుదీర్థమైన ప్రస్థానం ఉన్న సురేష్ ప్రొడక్షన్ ప్రస్తుతం వ్యవహారాలు రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్బాబు చూసుకుంటున్నారు. భారతదేశ సినిమా చరిత్రలోనే ఇంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్న సంస్థలు చాలా తక్కువ. ఇప్పటకీ పోస్టర్ మీద ఎస్పీ అన్న లోగో చూస్తూనే ప్రేక్షకుడిలో సినిమా చూడాలన్న ఉత్సుకత కలుగుతుంది.
ఇలాంటి క్రెడిబులిటీ సంపాదించుకున్న సురేష్ ప్రొడక్షన్ లోగో గురించి ఆసక్తికరమైన కథే ఉంది. సురేష్బాబు తన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ బ్యానర్లో కనిపించే ఇద్దరు పిల్లల్లో ఒకరు వెంకటేష్ అయితే, రెండో వ్యక్తి సురేష్బాబే అట. ఒక రోజు వీళ్లిద్దరు స్కూల్కు వెళ్లేందుకు రెడీ అవుతుంటే రామానాయుడు ఆ అక్షరాల మీద నిలబడమని చెప్పారట.
వీరిలో ఎస్ అక్షరం మీద నిలబడ్డ వెంకటేష్ స్టార్ అయితే... పీ మీద నిలబడ్డ సురేష్ ప్రొడ్యుసర్ అయ్యారట. ఇది కాకతాళీయంగా జరిగిందన్న విషయాన్ని కూడా సురేష్బాబు చెప్పారు. తనకు సినిమాలపై ఆసక్తి లేదని... అనుకోకుండా నిర్మాతగా సెటిల్ అయిపోయా అని సురేష్ బాబు చెప్పారు.