శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. నివేదా థామస్‌ కథానాయిక. రాహుల్‌ రామకృష్ణ, సత్యదేవ్‌, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రధారులు. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. వివేక్‌ సాగర్‌ స్వరకర్త. విజయ్‌కుమార్‌ నిర్మాత. 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు.

 

ముఖ్య అతిథి రామ్‌ మాట్లాడుతూ ‘‘వివేక్‌ ఆత్రేయ తెరకెక్కించిన ‘మెంటల్‌మదిలో’ బాగా నచ్చింది. ‘నిన్ను  కోరి’తో నివేదా ఎంత మంచి నటో అర్థమైంది. శ్రీవిష్ణు మంచి నటుడు. తనకు ఈ చిత్రం విజయాన్ని అందించాల’’న్నారు. మనసు మెచ్చిన చిత్రం అవుతుందన్నారు.

 

శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘మిత్ర అనే పాత్ర నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నా. ప్రతి అమ్మాయిలోనూ మిత్ర ఉంటుంది. అందుకే ఆడపిల్లల కోసం ఈ సినిమా చేస్తున్నా. ఈ పాత్రలో నివేదా అదరగొట్టేసింద’’న్నారు. నారా రోహిత్‌ మాట్లాడుతూ ‘‘విడుదలకు ముందే ఈ టీమ్‌లో ఆనందం కనిపిస్తోంది. వాళ్లెంత మంచి సినిమా తీశారో అర్థమైపోతోంద’’న్నారు.

 

‘నేను కాదు.. ఈ సినిమానే మాట్లాడాలన్నారు.. దర్శకుడు.’ ‘‘ఇది నాకు సినిమాయే కాదు. అంతకు మించి. ప్రతి అమ్మాయి ఈ సినిమా చూడాలనంది.. నివేదా. కార్యక్రమంలో డి.సురేష్‌బాబు, సత్యదేవ్‌, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: