ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాతకన్నుమూసిన సంగతి తెలిసిందే. విజయనిర్మల గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఇక విజయనిర్మల సూపర్స్టార్ కృష్ణకు రెండో భార్య అన్న సంగతి తెలిసిందే.
కృష్ణకు తొలి భార్య సంతానం ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఘట్టమనేని రమేష్బాబు, ఘట్టమనేని మహేష్బాబు ఉన్నారు. ఇక విజయనిర్మలకు తొలి భర్త కృష్ణమూర్తి ద్వారా నరేష్ జన్మించారు. ఇక విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకోవడం ముందుగా కృష్ణ ఫ్యామిలీకి నచ్చలేదు. అందుకే కొద్ది రోజుల పాటు కృష్ణ ఫ్యామిలీ విజయనిర్మలను పట్టించుకోలేదన్న టాక్ అయితే ఉంది. ఆ టైంలో విజయనిర్మల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారని అంటారు.
ఆ తర్వాత బయట ప్రపంచం కూడా ఈ జంటను ఆమోదించడం... ఈ జంటకు తెలుగు ప్రజల్లో ఉన్న క్రేజ్, విజయనిర్మల వల్లే కృష్ణ కష్టాలు తీరడం ఇలా అనేక కారణాలతో చివరకు కృష్ణ ఫ్యామిలీ కూడా వీరిని అంగీకరించక తప్పలేదని అంటారు. విజయనిర్మలను కృష్ణ వివాహం చేసుకున్నాక బయట ఫంక్షన్లు, ఇతరత్రా కార్యక్రమాలకు వీరిద్దరే కలిసి ఎక్కువుగా వచ్చేవారు. కృష్ణ కూడా ఎక్కువుగా విజయనిర్మల దగ్గర ఉండేందుకే ఆసక్తి చూపేవారు.