రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాంష్ నటించిన ‘రాజ్ దూత్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి అదేవిధంగా తన వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తిక విషయాలను షేర్ చేసాడు. ‘రాజ్ దూత్’ అనే బైక్ చుట్టూ ఈమూవీ కథ తిరుగుతుందని చెపుతూ రాజస్థాన్ లో ఒక వ్యక్తి బైక్ కోసం గుడి కట్టిన సంఘటనను స్పూర్తిగా తీసుకుని ఈ కథ అల్లబడినట్లు తెలియచేసాడు.

శ్రీహరి జీవించి ఉన్న రోజులలో తన అన్నను దర్శకుడుగా తనను హీరోగా చేయాలని కలలు కన్న విషయాలను ప్రస్తావిస్తూ ఆకలలు శ్రీహరి చనిపోయిన తరువాత తీరడం దురదృష్టం అన్నాడు. అయితే తమ తల్లి డిస్కో శాంతికి తామిద్దరం సినిమాలలోకి రావడం ఇష్టం లేదనీ అయితే తమకు సినిమా రంగం పట్ల ఉండే మోజుతో పాటు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం తామిద్దరం సినిమా రంగంలోకి వచ్చిన విషయాలను వివరించాడు. 

తన అన్న ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ దర్శకుడుగా రాణించడానికి చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ తాను నటనలో అదేవిధంగా డాన్స్ లో కోచింగ్ తీసుకున్న విషయాలను వివరించాడు. ఇదే సందర్బంలో మేఘాంష్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చాడు. 

ఈమూవీ ఫంక్షన్ లో తాను మాట్లాడుతూ ఈమూవీ ప్రాజెక్ట్ వెనుక జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహం ఉంది అని చెప్పినట్లు వార్తలు వచ్చాయని ఆ వార్తలను చూసి తాను షాక్ అయిన విషయాన్ని వివరించాడు. తాను జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానిస్తాను అని చెప్పిన విషయం నిజమే అయినా ఈమూవీ ప్రాజెక్ట్ వెనుక జూనియర్ ప్రోత్సాహం కానీ పరోక్ష హస్తం కానీ ఏమిలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో వారసుల హవా బాగా నడుస్తున్న నేపధ్యంలో ఈ వారసత్వపు హీరోను ఎలా ఆదరిస్తారో అన్న విషయం మరికొద్ది రోజులలో తేలిపోతుంది..     


మరింత సమాచారం తెలుసుకోండి: