ప్రేక్షకులకు ఉత్తమ చిత్రాన్ని అందించాలన్న కసితో 'నిను వీడని నీడను నేనే' చిత్రం చేశామని హీరో సందీప్ కిషన్ అన్నారు. ఆ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్లో నిర్వహించారు. సందీప్ కిషన్, అన్యా సింగ్ హీరో హీరోయిన్లు. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు.
అనిల్ సుంకర మాట్లాడుతూ ''సందీప్ కిషన్ నిర్మాతగా మారి చేస్తున్న చిత్రమిది. ఒక హీరో నిర్మాణంలో అడుగుపెట్టడం డేరింగ్ స్టెప్. కథపైనా, దర్శకుడిపైనా నమ్మకంతో ఈ సినిమా చేశాడు. ఈ ప్రయాణంలో తను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నా. పెద్ద సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది' అని తెలిపారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ..
నన్ను నేను వెండితెరపై చూసుకుని రెండేళ్లు అవుతోంది..ఒక యాక్టర్గా అది నరకం. సినిమా తప్ప ఇంకేదీ తెలియని నాలాంటి వాడికి పెద్ద నరకం. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. అది విని తట్టుకోలేం ఏమో అని థియేటర్కి వెళ్లలేదు. ఆ సమయంలో విదేశాలు వెళ్లాను ఇక్కడి నుంచి బయటకు వెళితే కాస్త బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది' అని అనుకున్నా. తిరిగి వచ్చేసరికి బాగా లావు అయ్యాను.
మాకు బాగా కావలసిన ఇండిస్టీ వ్యక్తిని కలిశారు మావాళ్లు. ఆయన చాలా పెద్ద వ్యక్తి. మాటల మధ్యలో మేనేజర్లు నా గురించి చెప్పబోతే... 'ఇంకెక్కడి సందీప్! అయిపోయాడు. కొత్త హీరోల వచ్చారు కదా. వాళ్ల గురించి చెప్పు' అన్నారట. ఆ మాట అన్న వ్యక్తికి థాంక్యూ ఆయనపై నాకు ఎలాంటి కోపమూ లేదు. ఆయన అలా అనడం వల్ల ఈ సినిమా చేశా. ఎందుకు అంటే... నా జీవితంలో నేను ఎప్పుడు ఏది చేయాలి అనేది డిసైడ్ చేయడానికి ఎవరికీ హక్కు లేదు. నాకు మాత్రమే హక్కు ఉంది, అని కసిగా మాట్లాడారు.