సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ చిత్రం ‘ఓ బేబీ’. దక్షిణ కొరియా బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి బీవీ నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు.

 

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ట్రైలర్‌ను చూసిన ప్రేక్షకులు సమంత హిట్టు కొట్టడం ఖాయమంటున్నారు. 23 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ 70 ఏళ్ల బామ్మ యాటిట్యూడ్‌తో ఆమె నటించిన తీరు ఎలా ఉంటుందో ట్రైలర్‌లో చూపించారు. సినిమాలో సమంత విశ్వరూపం చూపించడం ఖాయమని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. కామెడీ, ఎమోషన్‌తో కూడిన ఈ ఫాంటసీ డ్రామా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచేలా నటుడు, దర్శకుడు అడివి శేష్ ‘ఓ బేబీ’ ఫస్ట్ రివ్యూను వెల్లడించారు. తాజాగా సినిమా చూసిన ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘ఓ బేబీ సినిమా చూశాను! హృదయాన్ని హత్తుకునే తీయని ఫాంటసీ కథ. నందినిరెడ్డి ప్రతి ఎమోషన్‌ను చాలా కచ్చితంగా తెరకెక్కించారు. సమంత అయితే అద్భుతంగా చేశారు. చాలా అందంగా ఉన్నారు. లక్ష్మి గారు సినిమాకు ప్రాణం.

 

చిన్మయి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాగశౌర్య, రావు రమేష్ గారు చాలా హుందాగా నటించారు’ అని అడివి శేష్ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో రాజేంద్ర ప్రసాద్ సహా మిగిలిన నటీనటుల గురించి ప్రస్తావించారు. ‘రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రగతి, తేజ ఇలా తారాగణం అంతా చాలా బాగా చేశారు. ఈ రమ్యమైన కల్పితకథలో ప్రతి అంశం నిజంలానే అనిపిస్తుంది. ఇలాంటి సినిమాను అందించిన నిర్మాతలకు వందనం. అని పొగిడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: