శ్రీహరితో కలిసి మేఘాంశ్ భైరవ సినిమాలో నటించాడు. ఇది తన రెండో సినిమా. పాఠాల కంటే డైలాగుల పేజీలు బాగా చదువుతాడు. ట్రైలర్ చూసిన తర్వాత తండ్రి పేరు నిలబెడతాడన్న నమ్మకం కలిగింది అని అన్నారు శాంతి శ్రీహరి. దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం రాజ్‌దూత్.

 

అర్జున్, కార్తిక్ దర్శకులు. ఎమ్.ఎల్.వి సత్యనారాయణ నిర్మించారు. ఈ నెల 5న విడుదలకానుంది. నక్షత్ర, ప్రియాంకవర్మ కథానాయికలు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. మేఘాంశ్ మాట్లాడుతూ రాజ్‌దూత్ బైక్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. జనవరిలో ప్రారంభించి తక్కువ సమయంలో పూర్తిచేశాం.

 

చాలా కష్టపడి చేశాం అని తెలిపారు. మమ్మల్ని, మా కథను నమ్మి మేఘాంశ్‌తో పాటు నిర్మాత ఈ సినిమా చేశారని దర్శకద్వయం పేర్కొన్నారు. తలసాని సాయికిరణ్ మాట్లాడుతూ మేఘాంశ్ వందశాతం తండ్రి పేరును నిలబెడతాడు. సినిమా పెద్ద విజయాన్ని సాధించి అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలి అని చెప్పారు.

 

సి.కల్యాణ్ మాట్లాడుతూ శ్రీహరి పెద్దకొడుకు దర్శకుడిగా, మేఘాంశ్ హీరోగా ఓ సినిమాను తప్పకుండా నిర్మిస్తాను. మేఘాంశ్ తండ్రి మాదిరిగా పెద్ద స్టార్ అవ్వాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాబీ, శ్రీరామ్ ఆదిత్య, అజయ్‌భూపతి, రవికుమార్ చౌదరి, ఏడిదశ్రీరామ్, ఆదిత్యమీనన్ తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: