తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించే నటుడు రాజేంద్ర ప్రసాద్. పాత్ర ఏదైనా అవలీలగా చేసేయగల నటుడు. తెలుగు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న స్థానం ప్రత్యేకం. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుండి చాలా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ గా వస్తున్న "ఓ! బేబి" సినిమాలో నటించారు. ఈ సినిమా ఈ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్నే జరిగింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ తాగే సన్నివేశంలో నటించేందుకు సెట్లో నిజంగానే మద్యం సేవించి గొడవ చేశారని, దాంతో సెట్లోని నటీమణులు అసౌకర్యానికి గురయ్యారని తప్పుడు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్లో వైరల్గా మారింది. ఈ విషయం గురించి శనివారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ స్పందించారు.
తాను చదువుకున్న నటుడిని, తాను సీనియర్ ఎన్టీఆర్లాగా పాత్రలో లీనమైపోయి నటిస్తుంటానని పేర్కొన్నారు. ఎందుకంటే తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎన్టీఆర్ అని తెలిపారు. ఆయన ఓ పాత్రలో నటిస్తున్నప్పుడు ఇంటికి వెళ్లేవరకు అదే పాత్రలో లీనమైపోయి ఉంటారు. బహుశా తనకూ అదే అలవడినట్లుందన్నారు. ఈ నేపథ్యంలో ఓ బేబీ సినిమాలో తాగినట్లు నటించాల్సిన సన్నివేశం ఒకటి వచ్చిందన్నారు.
ఇందుకోసం తాను షాట్ రెడీ అని చెప్పడానికి ముందే మద్యం సేవించినట్లుగా నటించాను. దీనిపై ఎవడో మూర్ఖుడు తప్పుగా రాశాడు. విషయం తెలుసుకోకుండా అలా రాశాడు.. అది వాడి ఖర్మ. ఎవరేమనుకుంటే నాకేంటి.. నా నటన వల్ల సెట్లోని ఎవ్వరికీ ఇబ్బందికలగలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను అని చెప్పుకొచ్చారు రాజేంద్రప్రసాద్. కొరియన్ మూవీ అయిన "మిస్ గ్రానీ "ఆధారంగా తెరెకెక్కిన ఈ చిత్రం జులై 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.