తన నిర్మాణ సంస్థ వండర్‌ బార్‌ ఫిలింస్‌ మూతపడిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు సినీ నటుడు ధనుష్‌. ఈ బ్యానర్‌పై ధనుష్‌.. తన మావయ్య సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ‘కాలా’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించినంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.

 

‘కాలా’ సినిమా తర్వాత ధనుష్‌.. రజనీ కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. దాంతో సినిమా ఫ్లాప్‌ అవడం వల్లే ధనుష్‌.. రజనీతో కలిసి పనిచేయడం లేదని, నిర్మాణ సంస్థను మూసేయాలన్న యోచనలో ఉన్నారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ధనుష్‌ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘మా నిర్మాణ సంస్థ మూతపడడం లేదు.

 

నేను రజనీ సర్‌తో నా తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించకపోవడం వల్ల వస్తున్న వార్తలివి. చాలా మంది నిర్మాతలు ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేస్తుంటారు. అలాగని వారు నిర్మాణ వృత్తికి దూరంగా ఉంటున్నట్లు కాదుగా..! స్క్రిప్ట్స్‌ను ఇంకా ఫైనలైజ్‌ చేయలేదు. అన్నీ కుదిరాక త్వరలో తదుపరి సినిమాను ప్రకటిస్తాం.

 

ఏ నిర్మాణ సంస్థకైనా హిట్స్‌, ఫ్లాప్స్‌ సహజమే. మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. మళ్లీ రజనీ సర్‌తో కలిసి పనిచేయాలని ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇంకా ఏ సినిమా ఫైనలైజ్‌ అవ్వలేదు. మంచి స్క్రిప్ట్‌ లభిస్తే రజనీ సర్‌ను సంప్రదిస్తాం’ అని వెల్లడించారు ధనుష్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: