ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర తన కుమారుడు, గురుదాస్‌పూర్‌ ఎంపీ సన్నీ దేవోల్‌ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. తనకు కుమారుడిలాంటివాడైన సంగ్రూర్‌ ఎంపీ భగవంత్‌ సింగ్‌ మాన్‌ను చూసి నేర్చుకోవాలంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అసలు విషయమేంటంటే.. సన్నీ స్టైలిష్‌గా ప్యాంట్‌, షర్ట్‌ ధరించి బ్యాగ్‌ పట్టుకుని ఎయిర్‌పోర్ట్‌లోకి వెళుతున్నప్పుడు తీసిన ఫొటోను ఓ అభిమాని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘అరెవ్వా... సన్నీ దేవోల్‌ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నారో...’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

 

ధర్మేంద్ర స్పందిస్తూ.. ‘సన్నీ.. నా కుమారుడిలాంటివాడైన భగవంత్‌ సింగ్‌ మాన్‌ని చూసి నేర్చుకో. మాతృభూమికి సేవ చేయడానికి ఆయన ఎంతో త్యాగం చేశారు. నువ్వు చల్లగా ఉండాలి భగవంత్‌ మాన్‌. మీపై నాకెంతో అభిమానం ఉంది’ అని పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌ వెనక ఉద్దేశమేంటో అభిమానులకు అర్థంకాలేదు. ‘భగవంత్‌ మాన్‌ ఏం త్యాగం చేశారు?’ అంటూ ఓ నెటిజన్‌ సందేహం వ్యక్తం చేశారు. ఇందుకు ధర్మేంద్ర సమాధానమిస్తూ.. ‘ఆయన సినిమా కెరీర్‌ను వదులుకున్నారు’ అని పేర్కొన్నారు.

 

అంటే రాజకీయాల్లోకి వచ్చాక సినీ హీరోలా కాకుండా దేశానికి సేవ చేసే నేతలా మెలగాలని ధర్మంద్ర సన్నీకి చెప్తున్నారన్నమాట. భగవంత్‌ మాన్‌ రాజకీయాల్లోకి రాకముందు నటుడిగా, కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున సన్నీ దేవోల్‌ పోటీ చేసిన విషయం తెలిసిందే.

 

కాంగ్రెస్ అభ్యర్థి సునీల్‌ జాఖర్‌పై 82,459 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. అయితే ఎంపీ తానే అయినా తన నియోజకవర్గాలకు సంబంధించిన కార్యక్రమాలను తన ప్రతనిధి గురుప్రీత్‌ సింగ్‌ చూసుకుంటారని సన్నీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. విపరీతంగా షేర్స్ అండ్ కామెంట్స్ వస్తున్నాయి వీటికి. తెగ వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: