ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘RRR’ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. వ్యక్తిగత పని నిమిత్తం రాజమౌళి అమెరికా వెళ్లడంతో వారం రోజులపాటు షూటింగ్‌ ఆగిపోయింది. దీంతో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు విశ్రాంతి లభించింది. ఈ మేరకు చిత్ర నిర్మాత సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ట్వీట్ చేసింది.

 

‘RRR మూవీ షూటింగ్ అత్యంత విజయవంతంగా సాగుతోంది. మా భీమ్, రామరాజుతో దూసుకుపోతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుంటున్నాం. మరో వారం రోజుల్లో మళ్లీ మొదలుపెడతాం’ అని ట్వీట్‌లో పేర్కొంది. మరోవైపు రాజమౌళి సైతం తాను వాషింగ్టన్ వెళ్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్ RRR సినిమాను ముడిపెడుతూ చేయలేదు. అమెరికాలో ఉన్న తన అభిమానులను ఉద్దేశించి చేశారు. తాను వ్యక్తిగత పని మీద వాషింగ్టన్ వస్తున్నానని, ‘తానా’ కార్యక్రమం కోసం రావడంలేదని స్పష్టం చేశారు.

 

పెద్దన్న మ్యూజికల్ షోలో కూడా తాను హాజరుకాలేకపోవచ్చని చెప్పారు. ఆ కార్యక్రమానికి తాను వస్తానని జనం ఎదురుచూసి, ఆ తరవాత నిరుత్సాహాం చెందడం తనకు ఇష్టం లేదని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు. అందుకే ఈ వివరణ ఇస్తున్నానన్నారు. ఇదిలా ఉంటే, ‘RRR’ మూడో షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

 

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. చరణ్, ఎన్టీఆర్‌పై అక్కడ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా చిత్రీకరించనున్నారట. త్వరలోనే అజయ్ దేవగణ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటారని అంటున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: