అగ్ర కథానాయిక సమంత ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఆమె నటించిన ‘ఓ బేబీ’ సినిమా శుక్రవారం విడుదలై, మంచి టాక్ అందుకుంది. మరోపక్క ట్విటర్లో నెటిజన్లు, పలు మీడియా వెబ్సైట్లు రివ్యూలు రాసి సామ్ను మెచ్చుకున్నారు. వీటిని చూసిన సామ్ సంతోషంతో వారికి ధన్యవాదాలు చెప్పారు. ప్రేక్షకుల్ని దీనికి మించి ఇంకేం అడగనని అన్నారు.
ఈ నేపథ్యంలో.. మహిళా ప్రాధాన్యంతో ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమాను ఇంతగా ఆదరించలేదని, కానీ సమంత వల్ల అది సాధ్యమైందని ఓ వెబ్సైట్ రివ్యూ రాసింది. దీన్ని చూసిన సామ్ రిప్లై ఇచ్చారు. ‘ఈ రివ్యూ చదివి నేను ఏడ్చేశా. ఇది నేను మరింత కష్టపడి పనిచేసేందుకు స్ఫూర్తినిచ్చింది’ అని ఆమె అన్నారు.
అదేవిధంగా ‘సమంత అదరగొట్టింది’ అంటూ మరో మీడియా సంస్థ పేర్కొంది. దీనికి సామ్.. ‘ఓకే.. ఇప్పుడెళ్లి నేను నిద్రపోతా. ధన్యవాదాలు’ అని ప్రతిస్పందించారు. సినిమా విడుదల నేపథ్యంలో సామ్ రాత్రంతా నిద్రపోలేదు. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు.
అంతేకాదు ఇప్పుడు ‘ఓ బేబీ’ చిత్ర బృందం ఫీలింగ్ ఇదంటూ.. తమిళ స్టార్ ధనుష్ సంబరంగా చిందులు వేస్తున్న వీడియోను సామ్ షేర్ చేశారు. కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్ ‘ఓ బేబీ’. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. లక్ష్మి, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ బాణీలు అందించారు.