దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా చేసిన కామెంట్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు సినీ నటి సమంత. ఆయన తెరకెక్కించిన ‘కబీర్‌ సింగ్‌’ (అర్జున్‌రెడ్డి రీమేక్‌) సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌.. కియారా అడ్వాణీని ముద్దుపెట్టుకునే సన్నివేశాల గురించి సందీప్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

 

‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై సమంత స్పందిస్తూ.. ‘ఈ వ్యాఖ్యలు చాలా అసంతృప్తికరంగా ఉన్నాయి’ అన్నారు.

 

సమంత స్పందనపై ఓ ఆంగ్ల మీడియా సంస్థ ట్విటర్‌లో వార్తను పోస్ట్‌ చేస్తూ.. ‘అప్పుడేమో ‘అర్జున్‌రెడ్డి’ సినిమా బాగుందన్నారు. ఇప్పుడు సందీప్‌ వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయి అంటున్నారు. సమంతది రెండు నాల్కల ధోరణి’ అని ప్రచురించారు. దీనికి సమంత సమాధానమిస్తూ..

 

‘ఒక సినిమాను ఇష్టపడటం వేరు. ఒకరు చేసిన వ్యాఖ్యలతో విభేదించడం వేరు. నాకు ‘అర్జున్‌రెడ్డి’ కథ బాగా నచ్చింది. దానర్థం ఇష్టమొచ్చినట్లుగా మనతో ఉన్నవారిపై చేయి చేసుకునే కాన్సెప్ట్‌ కూడా నాకు నచ్చిందని కాదు’ అని బదులిచ్చారు. ఈమె వ్యాఖ్యలపై శాండీ అభిమానులు ఒకింత గుర్రుగా వున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: