జూబ్లీహిల్స్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ సినీ నిర్మాత కుమారుడు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లోని డైమండ్ హౌస్ వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ కారును నిలువరించిన పోలీసులు దానిని నడుపుతున్న యువకుడికి శ్వాస విశ్లేషణ పరీక్షలు చేసేందుకు ప్రయత్నించగా అతను వాగ్వాదానికి దిగాడు.
తాను ప్రముఖుడి కుమారుడినంటూ హంగామా సృష్టించాడు. అదే సమయంలో విధుల్లో ఉన్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని అతడికి శ్వాస విశ్లేషణ పరీక్షలు చేయగా మద్యం సేవించినట్లు తేలింది. యువకుడు జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 25లో నివసించే ఓ సినీ నిర్మాత కుమారుడు సాయి నితీష్గా తేలింది.
దీంతో అతనిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.అతన్ని వదిలిపెట్టాలంటూ ఓ ప్రజాప్రతినిధి నుంచి సైతం పోలీసులకు ఒత్తిడి వచ్చింది. కాగా ఈ తనిఖీల్లో 12 ద్విచక్రవాహనాలు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారికి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాగా.. హైదరాబాద్ లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పైగా దొరికిన తరువాత ఇలా ప్రముఖుల కొడుకులం, కూతుళ్ళం.. అంటూ ఉడాయిస్తారు. నిజానికి వాళ్ళు వాళ్ళు కాకపోవచ్చు. అందుకే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు అలాంటివాళ్లపై పత్యేక నిఘా వహించారు.