తెలుగు చిత్రసీమలో పరభాషా కథానాయికల ప్రాబల్యం ఎక్కువ. వాళ్లే స్టార్లుగా చలామణీ అవుతున్నారు. దర్శకులు, నిర్మాతలు కూడా వాళ్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. అందువల్లే తెలుగమ్మాయిలకు స్థానం దక్కడం లేదు. ‘ఈ మాట నిజమే కానీ ప్రతిభను ప్రాంతాలవారీగా విడగొట్టడం కష్టం’ అంటోంది కాజల్‌. ‘‘సినిమా అనేది ఇప్పుడు ఒకే పరిశ్రమ.

 

ప్రాంతాన్ని బట్టి భాష మారుతుందేమో? సినిమా మారదు. పరభాషా నటీనటులే కాదు, సాంకేతిక నిపుణులు కూడా ఎక్కువవుతున్నారు. ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం తప్పు కాదు. నేను పంజాబీ అమ్మాయిని. కాకపోతే ఇప్పుడు తెలుగమ్మాయిలా మారిపోయాను. పంజాబీ భాషనీ, అక్కడి సంస్కృతిని ఎంత గౌరవిస్తానో, తెలుగు సంప్రదాయాలకూ అంతే విలువ ఇస్తాను.

 

తెలుగు భాష నాకు జీవనాధారం చూపించింది. అందుకే తెలుగునీ ప్రేమిస్తున్నాను. తెలుగిళ్లలో పండగలు, పెళ్లిళ్లూ ఎలా చేసుకుంటారో నాకు బాగా తెలుసు. ఆ మాటకొస్తే కొన్ని పంజాబీ సంప్రదాయాల కంటే.. తెలుగు సంప్రదాయాలే నాకు గుర్తున్నాయి.

 

నేనే కాదు.. ఎవరైనా అంతే. తెలుగు నుంచి మరో ప్రాంతానికి వెళ్లి జీవనోపాధి సంపాదించిన వాళ్లూ ఇలానే ఆలోచిస్తారు. భాష, ప్రాంతం సినిమాకి అతీతం. ఆ పరిధులు దాటి ఆలోచిస్తేనే మంచి సినిమాలొస్తాయి’’ అంటోంది కాజల్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: