మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, తొలిసినిమా ఒక ఒకమనసు సినిమాలో నాగ శౌర్య సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని ఆమెకు అందివ్వలేదనే చెప్పాలి. ఆ తరువాత ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయితే అంతకముందు ఒక టెలివిజన్ షో కి యాంకర్ గా కూడా వ్యవహరించి మంచి అనుభవం సంపాదించిన నిహారిక, మరోవైపు వెబ్ సిరీస్ పై కూడా దృష్టిపెట్టింది. 

ఇక ఆమె గతంలోనే తాను స్థాపించిన సొంత బ్యానరైన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' ద్వారానే 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇవి ప్రేక్షకుల మనసు గెలుచుకుని సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆ స్ఫూర్తితోనే సినిమాల్లో అడుగుపెట్టిన నిహారికకు ఒక్క సినిమా ద్వారా కూడా సక్సెస్ లభించకపోవడంతో, కొద్దిరోజుల నుండి ఆమె కొంత నిరాశలో ఉన్నట్లు సమాచారం. ఇక నేడు ఈ విషయమై ఒక వార్త, పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఇకపై నిహారిక సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకుందని, ఈ మేరకు ఇదే విషయాన్ని తండ్రి నాగబాబుకు మరియు పెద నాన్న అయిన చిరంజీవికి తేల్చి చెప్పడం జరిగిందని అంటున్నారు. 

అయితే తాను సినిమాలు చేయనప్పటికీ వెబ్ సిరీస్ మాత్రం కంటిన్యూ చేస్తానని, అవసరం అయితే బయటి వారిని కూడా తీసుకుని తమ బ్యానర్ పై పలు వెబ్ సిరీస్ తీయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం పుకారవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మెగా ఫ్యాన్స్ కు ఇది ఒకరకంగా చేదు వార్త అనే చెప్పాలి. ఒకవేళ నిహారిక సినిమాలు పూర్తిగా వదిలేసి, మరోవైపు వెబ్ సిరీస్ పై దృష్టిపెట్టినట్లైతే, ఆ విధంగా అయినా ఫ్యాన్స్ ఆమెను ఆదరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇందులో పూర్తి నిజానిజాలు అధికారికంగా వెల్లడి కావలసి ఉంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: