చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతపడుతున్నారు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఆకలితో ఉన్న వీరిద్దరూ ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో జతకట్టారు. ఇందుకోసం పక్కా మాస్ మసాలా కథతో 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమాను రెడీ చేశారు. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటిస్తున్నారు. 


ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న 'ఇస్మార్ట్ శంకర్' జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే విడుదలైన రామ్ లుక్, టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ హ్యాపీగానే ఉంది. ముందు ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, ఇంగ్లండ్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కార‌ణంగా ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత అంటే జూలై 18న విడుద‌ల చేస్తామ‌ని కొత్త తేదీని ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్.


ఈ సినిమాలో రామ్ కండలు తిరిగిన బాడీతో సరికొత్తగా కనిపిస్తున్నాడు. అలాగే డ్యాన్స్‌ కూడా ఇదరగదీశాడన్న టాక్ వినిపిస్తోంది. దీనికితోడు తెలంగాణ యాసతో చెప్పే డైలాగులు ఈ సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తాయన్న టాక్ వినిపిస్తుండడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్నో అవాంతరాల మధ్య త్వరలో విడుదల కానున్న 'ఇస్మార్ట్ శంకర్'కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు షాక్ ఇచ్చారని ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. 


'ఇస్మార్ట్ శంకర్'ను విడుదల చేయడానికి దిల్ రాజు నిరాకరించారన్నదే ఆ వార్త సారాంశం. పూరీ జగన్నాథ్‌తో పాటు రామ్ ఈ సినిమాను డిస్టిబ్యూట్ చేయాల్సిందా దిల్ రాజును కోరారట. అయితే, ఆయన దీనికి ముందుకు రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన సినిమా చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారా..? లేక చూడకుండానే వద్దనుకున్నారా..? అన్నది మాత్రం తెలియరావడం లేదు. 


దిల్ రాజు ఏదైనా సినిమాను విడుదల చేశారంటే అది మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే నానుడి ఉంది. కానీ, గత సంవత్సరం ఆయన ట్రాక్ రికార్డ్ ఏమంత బాగోలేదు. ఆయన విడుదల చేసిన పలు సినిమాలు నష్టాలను మిగిల్చాయి. ఇందులో పూరీ కుమారుడు ఆకాశ్ హీరోగా చేసిన 'మెహబూబా' ఉంది. ఈ కారణంగానే 'ఇస్మార్ట్‌ శంకర్'ను విడుదల చేయడం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: