టాలీవుడ్  లో ఇప్పుడు యంగ్ జెనరేషన్ హీరోస్.. డైరెక్టర్స్ హవా నడుస్తోందన్న విషయం ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలను చూస్తే క్లియర్‌గా తెలుస్తోంది. 'క్షణం'.. 'గూఢచారి' సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని తెలిపిన అడివి శేష్ తాజాగా 'ఎవరు' అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు.  అందులో భాగంగానే ఈ సినిమా ప్రీ లుక్ ను విడుదల చేశారు. 

ప్రీ లుక్ లో కథకు సంబంధించిన విశేషాలు ఏవీ బయటకు లీకవ్వలేదు. కానీ ఈ సినిమాలో శేష్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతిని మాత్రం రివీల్ చేశారు.  ఈ ప్రీ లుక్ పోస్టర్ లో  శేష్ ఒక పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు.  ఈ సినిమాలో 'విక్రమ్ వాసుదేవ్' పాత్రలో శేష్ నటిస్తున్నట్టు ఆయన యూనిఫామ్ పై ఉన్న బాడ్జ్ చెప్తోంది. ఈ పోస్టర్ లో 'జులై 11 న ఫస్ట్ లుక్ విడుదల' అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే డేట్ ను వెల్లడించారు చిత్ర బృందం.
 
ఈ సినిమాలో రెజీనా కసాండ్రా.. మురళి శర్మ.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల అందిస్తున్నాడు.  వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని పీవీపీ సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు.  'క్షణం' తర్వాత పీవీపీ బ్యానర్ లో అడివి శేష్ మరోసారి నటిస్తున్న సినిమా ఇది.  మరి 'క్షణం' తరహాలోనే పీవీపీ బ్యానర్ కు మరో విజయాన్ని అందిస్తుందా లేదా అనేది ఈ సినిమా రిలీజైతే గాని తెలీదు. ఇక ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమాకి రీమేక్ అన్న వార్త ఒకటి గతంలో హల్‌చల్ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: