‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అనే చిన్న సినిమా విడుదలకు ముందే ఆసక్తికర ప్రోమోలతో జనాల దృష్టిని ఆకర్షించింది. ఇది కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపించింది. కానీ చిన్న సినిమాలకు బాగున్నాయన్న టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు రావడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన ‘ఆత్రేయ’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో అన్నసందేహాలు వ్యక్తమయ్యాయి. 


ఈ సందేహాల్ని పటాపంచలు చేస్తూ ఈ చిన్న సినిమా చక్కటి వసూళ్లు సాధించింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని హీరో నవీన్ పొలిశెట్టితో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రెటీలు గట్టిగా ప్రమోట్ చేయడంతో జనాలకు చేరింది. సినిమాకు వసూళ్లు అంచనాలకు మించి వచ్చాయి. రూ.10 కోట్ల గ్రాస్‌తో ఆశ్చర్యపరిచిందీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’.


‘ఆత్రేయ’ సీక్వెల్‌కు స్కోప్ ఉన్న సబ్జెక్ట్. దీన్ని ఫ్రాంఛైజ్ లాగా చేస్తామని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. నవీనే హీరో. స్వరూపే దర్శకుడు. రాహుల్ యాదవే నిర్మాత. ఐతే వీళ్లకు ఒక స్టార్ హీరో కూడా తోడై ‘ఆత్రేయ-2’కు మరింత క్రేజ్ తీసుకురాబోతున్నట్లు సమాచారం.  ఆ స్టార్ మరెవరో కాదు.. నాని. ఇప్పటికే ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాలో భాగస్వామిగా ఉండి.. ఆపై ‘అ!’ చిత్రంతో పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు నాని. ఇప్పుడతను రాహుల్‌తో కలిసి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీక్వెల్ తీయబోతున్నట్లు సమాచారం. 


ఈ చిత్రం గురించి విడుదలకు ముందే చాలా పాజిటివ్‌గా మాట్లాడి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు నాని. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుండే అతను ‘ఆత్రేయ’ సీక్వెల్‌లో నిర్మాణ భాగస్వామిగా మారి దాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని అనుకున్నాడట. త్వరలోనే  ఈ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశముంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: