టాలీవుడ్ లో ఈ శుక్రవారం మూడు సినిమాలు థియేటర్లలో కి వచ్చాయి. వరుస ప్లాపులతో ఉన్న సందీప్ కిషన్ నటించిన నిను వీడని నీడను నేనే - విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ... జీవిత రాజశేఖర్ దంపతుల కుమార్తె శివాత్మిక జంటగా వెండితెరకు పరిచయం అయిన దొరసాని సినిమాలతో పాటు దివంగత రియల్ స్టార్ శ్రీహరి తనయుడు హీరోగా పరిచయమైన రాజ్దూత్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూడు సినిమాలకు చేయాల్సినంత హడావుడి చేశారు. విచిత్రమేంటంటే మూడు సినిమాలకు అంత గొప్ప టాక్ కూడా రాలేదు.
నిను వీడని నీడను నేనే - దొరసాని సినిమాలకు మంచి ఓపెనింగ్స్ లేకపోయినా ఓ మోస్తరు ఫిగర్లు అయినా కనపడ్డాయి. రెండో రోజు కలెక్షన్లు పరవాలేదనిపించేలా ఉన్నాయి. కానీ రాజ్దూత్కు మాత్రం తొలి రోజు మార్నింగ్ షో నుంచే కనీసం థియేటర్ ఖర్చులు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. దివంగత శ్రీహరి కుమారుడిగా పరిచయం కావడంతో ఇండస్ట్రీలో ఆ కుటుంబానికి తెలిసిన వాళ్ళు కూడా కాస్త సాయం చేశారు. ఇండస్ట్రీ పరిచయాలు వాడుకొని బి, సి సెంటర్లలో కూడా రాజ్దూత్ రిలీజ్ చేశారు.
పోటీ సినిమాలు లేకపోవడం.... థియేటర్లలో మంచి సినిమాలు లేకపోవడంతో రాజ్దూత్కు గట్టి పోటీ కూడా లేదు. అయితే ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ లేకపోవడంతో సినిమా తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. మిగిలిన రెండు సినిమాలకు కనిపిస్తున్న కలెక్షన్లలో పదోవంతు కూడా రాజ్ దూత్ కు లేవు.
సినిమాను మరింత బలంగా జనాల్లోకి తీసుకెళ్లి వుండాల్సిందన్న చర్చ కూడా వినిపిస్తోంది. విచిత్రం ఏంటంటే అసలు క్రిటిక్స్ కూడా ఈ సినిమాను పట్టించుకోకపోవడం. ఎక్కడా ఒక్క సమీక్ష కూడా కనిపించకపోవడం (ఎవరో ఒకరో ఇద్దరో మినహా) దారుణం. మేఘాంశ్ రెండో ప్రయత్నంలో అయినా హిట్ కొట్టేలా కసితో ఉండాలి.