అడల్ట్ కంటెంట్ తో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తున్నాయి కానీ వివాదాలకి కూడా అంతకుమించి కారణమవుతున్నాయి. కబీర్ సింగ్ రెండువందల యాభై కోట్ల నెట్ వసూళ్లని ఇండియాలో సాధించినా కానీ ఒకవర్గం చేత విపరీతంగా మాటలు పడుతోంది. విమర్శకులే కాకుండా జనరల్ పబ్లిక్లో ఒక వర్గం కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. షాహిద్ కపూర్ అద్భుతం గా నటించినా కానీ కబీర్సింగ్ కంటెంట్, ఐడియాలజీని జనం తప్పుబడుతున్నారు.
అంతేకాదు కబీర్ సింగ్ని తిట్టిపోసే వాళ్లలో సింగర్ చిన్మయి శ్రీపాద కూడా చేరింది. మన్మథుడు 2 డైరెక్ట్ చేస్తోన్న రాహుల్ రవీంద్రన్ భార్య అయిన చిన్మయి 'కబీర్సింగ్' చిత్ర దర్శకుడు సందీప్ వంగా ఆలోచనలని ఎత్తిచూపింది. ఈ విషయంలో ఆమెకి సమంత అక్కినేని కూడా సపోర్ట్ చేసింది. దీంతో కబీర్సింగ్ అభిమానులు వాళ్ళపై దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 'మన్మథుడు 2' కంటెంట్ చర్చకి దారితీసింది. అరవయ్యేళ్ల నాగార్జునతో ఆయన వయసులో సగం కూడా లేని రకుల్ నటించడం ఏమిటి..? అని ప్రశ్నించడంతో పాటు మన్మథుడు ట్రైలర్స్లోను డైలాగ్స్, సీన్స్ని కూడా ట్రోల్ చేస్తున్నారు.
అనుకోకుండా మన్మథుడు 2 కూడా కబీర్సింగ్ చర్చలోకి చేరిపోవడంతో పాటు చిన్మయిని కార్నర్ చేయడానికి ట్రోల్స్కి మంచి ఛాన్స్ దొరికింది. దీంతో సినిమా విడుదలైన తర్వాత ట్రోలింగ్ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం వుందని గ్రహించిన నాగార్జున 'మన్మథుడు 2'లో డబుల్ మీనింగ్ డైలాగులు, ఘాటైన సన్నివేశాలు తొలగించాలని దర్శకుడు రాహుల్కి సూచించినట్లు లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్లో హల్చల్ చేస్తోంది.