రాజశేఖర్ నటించిన ‘కల్కి’ గత నెల విడుదల అయితే మొన్న శుక్రువారం విడుదలైన రాజశేఖర్ కూతురు శివాత్మిక నటించిన ‘దొరసాని’ విడుదలైంది. ఇలా కేవలం రెండువారాల గ్యాప్ తో తమ కుటుంబం నుండి రెండు సినిమాలు వచ్చిన నేపధ్యంలో జోష్ లో ఉన్న రాజశేఖర్ ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తన కుటుంబానికి సంబంధించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. 

తన సినిమాలు వరస పరాజయాలు చెందడంతో చెన్నైలోని తన ఆస్తులను కూడ అమ్ముకుని అప్పులు తీర్చిన విషయాలను వివరిస్తూ అప్పట్లో తన పరిస్థితిని చూసి తన తల్లి చివరి రోజులలో ప్రతిరోజు ఏడుస్తూ గడిపిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. సావిత్రి లాంటి గొప్ప వ్యక్తులు బాగా బతికి చివరి దశలో చేతిలో ఏమీలేక మిగిలిన పరిస్థితిలా తన జీవితం మారిపోతుందా అంటూ తన తల్లి ప్రతిరోజు తనను ప్రశ్నించిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. 

అయితే తన పరాజయాలకు బ్రేక్ వేసిన ‘గరుడవేగ’ విడుదల సమయానికి తన తల్లి లేదు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆసినిమా హిట్ అయింది అని తెలుసుకుని తన తల్లి ఫోటో ముందు చిన్న పిల్లవాడిలా ఏడ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఇదే సందర్భంలో తన లేటెస్ట్ మూవీ ‘కల్కి’ గురించి మాట్లాడుతూ ఆమూవీ విడుదలకు ముందు తాను కొంతమందికి చూపెడితే ‘బాగుంది’ అన్నమాట అనడంతో ఇంత సింపుల్ గా మాట్లాడిన వారి గురించి తనకు విపరీతమైన టెన్షన్ మొదలై ‘కల్కి’ విడుదలకు ముందురోజు రోజుకంటే ఎక్కువగా నిద్రమాత్రలు వేసుకున్న విషయాన్ని బయటపెట్టాడు. 

తెల్లవారి చాల సమయం అయినా తాను నిద్ర నుంచి లేవకపోవడంతో ఖంగారు పడిన తన పిల్లలు జీవిత తనను బలవంతంగా లేపి ‘కల్కి’ హిట్ అయింది అన్న విషయం చెప్పేవరకు తాను పడ్డ మెంటల్ టార్చర్ వర్ణనాతీతం అని అంటున్నాడు. ఇదే సందర్భంలో ‘కల్కి’ మూవీలోని తన లుక్ గురించి మాట్లాడుతూ తనకు ఈమధ్య పొట్ట పెరగడంతో ఆ పొట్టను తగ్గించుకోవడానికి విపరీతంగా వ్యాయామం చేయడంతో పాటు ‘కల్కి’ షూటింగ్ లో విపరీతంగా కష్టపడడంతో కొద్దిరోజుల క్రితం తనకు తేలికపాటి అనారోగ్యం చేసిన విషయం అంగీకరించాడు. తనకు విలన్ పాత్రలను చేయాలని ఉంది అని ఓపెన్ గా చెపుతున్నా తనకు అవకాశాలు రాకపోవడం వెనుక గల కారణాలు తనకు అర్ధం కావడం లేదు అంటూ వరసపెట్టి సినిమాలు చేసి పరాజయాలు తెచ్చుకునే కంటే ఖాళీగా ఉండటం కొంతవరకు గౌరవం అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు రాజశేఖర్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: