సీనియర్ నటుడు సత్యరాజ్‌కు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తండ్రిగా నటిస్తున్నారట! ఆయనకు తండ్రిగా నటించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అంటున్నారు తేజూ!! సాయి ధరమ్ తేజ్ ఏంటి.. సత్యరాజ్‌కు తండ్రిగా నటించడమేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా..! సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. బన్నీ వాసు నిర్మాత. ఎస్కేఎన్ సహ నిర్మాత. రాశీ ఖన్నా హీరోయిన్. ఈ సినిమాలో తేజూ తండ్రిగా సత్యరాజ్ నటిస్తున్నారు. 


ఈ విషయాన్ని సరదాగా తేజూ పైవిధంగా వెల్లడించారు. దీనికి ఒక కారణం ఉంది. సత్యరాజ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 41 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా తన తండ్రికి ఇన్ని సంవత్సరాల పాటు ప్రోత్సాహాన్ని అందించిన అందరికీ సత్యరాజ్ తనయుడు సిబి సత్యరాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు సాయి ధరమ్ తేజ్ స్పందించారు. ‘ఇంత అద్భుతమైన ప్రయాణం చేసిన మీకు అభినందనలు సత్యరాజ్ గారు. నా తరవాత సినిమాలో మీకు తండ్రిగా నటిస్తుండటం నాకు కలిగిన గొప్ప గౌరవం’ అని నవ్వుతోన్న ఎమోజీని పెట్టి తేజూ ట్వీట్ చేశారు. 


తేజూ ఈ ట్వీట్‌ను సరదాగా చేసినా ఆసక్తికరంగా ఉంది. ఇదిలా ఉంటే, 1978లో తమిళ సినీ పరిశ్రమలో సత్యరాజ్ ప్రయాణం మొదలైంది. కెరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా చేసిన ఆయన ఆ తరవాత సోలో హీరోగా మారారు. దర్శకత్వం కూడా వహించారు. తమిళంలోనే అత్యధిక సినిమాలు చేశారు. అయితే, 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిర్చి’ సినిమాతో సత్యరాజ్‌కు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రతో సత్యరాజ్ క్రేజ్ దేశవ్యాప్తం అయిపోయింది. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: